← Back to headlines

హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్

2026-05-09 16:27 • original

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాన్వాయ్‌తో హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు నిర్వహిస్తున్న ట్రయల్ రన్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు బంజారాహిల్స్ మార్గంలో కాన్వాయ్ ట్రయల్ రన్ చేపట్టారు. అయితే, కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్ అటువైపుగా వచ్చింది. దీంతో ఆయన వాహనశ్రేణి ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడి, సుమారు 10 నిమిషాల పాటు ట్రాఫిక్‌లోనే నెమ్మదిగా కదులుతూ ఉండిపోయింది.

ట్రాఫిక్ జామ్ తీవ్రంగా ఉండటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు తన కారు నుంచి కిందకు దిగారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో చంద్రబాబు కాన్వాయ్ అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్లిపోయింది. ఉన్నతాధికారుల మధ్య సమాచార లోపం వల్లే ఈ గందరగోళం తలెత్తినట్లు తెలుస్తోంది.

The post హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్ appeared first on Navatelangana.