← Back to headlines

షరతులతో సంబంధం లేకుండా ఉపాధి హామీని కొనసాగించాలి

2026-05-09 12:31 • original

నవతెలంగాణ-నెల్లికుదురు
షరతులతో సంబంధం లేకుండా ఉపాధి హామీని కొనసాగించి సమయపాలన రద్దుచేసి రోజువారికి రూ.600 కూలి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి యాకోబు తెలిపారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో ఉపాధి హామీ కూలీల పని ప్రదేశాన్ని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకునే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ పేదలు వలసలు పోకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాధించుకున్న ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేసి పేదలకు న్యాయం చేశామని అన్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి బీబీ రాంజీ చట్టంగా పేరు పెట్టిందని దాంతో పేదలకు చాలా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చెందారు. అందుకోసం దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఎండాకాల సమయంలో నాలుగు గంటలు కచ్చితంగా పనిచేయాలని కొలతల ప్రకారం పనిచేయాలని, ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల పట్ల ఇలాంటి షరతులు విధించడం సరైన విధానం కాదని సమయపాలన రద్దుచేస్తూ కోలతల విధానాన్ని రద్దు పరచాలని రోజుకు కనీస వేతనం 600 ఇవ్వాలని, పని ప్రదేశంలో టెంటు మెడికల్ కిట్టు మంచి నీటి అన్ని గ్రామాలలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇసంపల్లి సైదులు, ఉపాధి హామీ కూలీలు నాగరాజు, ఐలయ్య ,ఎల్లయ్య నీలమ్మ, ఎల్లమ్మ ,మంగమ్మ, పూలమ్మ ,సంగీత , అనసూర్య ,అన్న ప్రేమ చంద్రయ్య  వీర ఝాన్సీ ,పద్మ తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

The post షరతులతో సంబంధం లేకుండా ఉపాధి హామీని కొనసాగించాలి appeared first on Navatelangana.