← Back to headlines

గ్రామాల్లో సులభతరం కానున్న విద్యుత్ సేవలు

2026-05-08 13:26 • original

సర్పంచ్‌లతో సమావేశమైన ఏడీఈ వెంకటరత్నం
నవతెలంగాణ – అశ్వారావుపేట

గ్రామాల్లో విద్యుత్ సేవలు ఇకపై మరింత సులభతరం కానున్నాయి. విద్యుత్ శాఖ చేపడుతున్న సంస్కరణలు పల్లెల స్థాయికి చేరనున్న నేపథ్యంలో ఎన్పీడీసీఎల్ ఏడీఈ వెంకటరత్నం గురువారం సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయితీ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు పలు అంశాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వీధి విద్యుత్ లైట్లకు సంబంధించిన మిడిల్ పోల్స్ ఏర్పాటు, వ్యవసాయ బోర్లకు మిడిల్ పోల్స్ మంజూరు, ఆదివాసీ కుటుంబాలకు గతంలో విద్యుత్ మీటర్లు లేని ఇళ్లకు ఉచితంగా విద్యుత్ మీటర్లు, కొత్త విద్యుత్ లైన్ల మంజూరు మరియు ఏర్పాటు వంటి అంశాలపై సర్పంచ్‌లతో చర్చించారు. ఈ సమావేశంలో అచ్యుతాపురం, పాత అల్లిగూడెం, రామన్నగూడెం, కన్నాయిగూడెం గ్రామాల సర్పంచ్‌లు సరిహద్దుల పోలయ్య, రామకృష్ణ, నాగేశ్వరరావు, సంకురు పాల్గొన్నారు.

The post గ్రామాల్లో సులభతరం కానున్న విద్యుత్ సేవలు appeared first on Navatelangana.