← Back to headlines

విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి

2026-05-09 23:26 • original

కలెక్టర్లతో సీఎస్‌ కె.రామకష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11వ తేదీ నుంచి నిర్వహించే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై సంబంధిత ఉన్నతాధికారులతో కలసి జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్లతో సీఎస్‌ మాట్లాడుతూ ఈ నెల 11న ఎల్‌.బి.స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు బారి సంఖ్యలో హాజరయ్యేలా కలెక్టర్లు చొరవ తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే వారోత్సవాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను, రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫార్మర్‌ రిజిస్ట్రీ కి సంబంధించిన పురోగతి, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, జనాభా స్వీయ గణనకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియొ కాన్ఫరెన్స్‌ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితారానా , కళాశాల విద్యా శాఖ కమీషనర్‌ శ్రీదేవసేన, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ , పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

The post విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి appeared first on Navatelangana.