ప్రజాస్వామ్యానికి ఆటంకంగా గవర్నర్ల తీరు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి
నవతెలంగాణ-వలిగొండ రూరల్
దేశంలో రాష్ట్రాలకు ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించాల్సిన గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారుతున్నారని, వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో జ్యోతి మాట్లాడారు. గవర్నర్లు ప్రధానంగా దేశంలో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధించడం, సకాలంలో అనుమతులు ఇవ్వకపోవడం, రాష్ట్రాల హక్కులను తొక్కి పెట్టడం చేస్తున్నారని అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నా రన్నారు. తమిళనాడు ప్రజలు మెజార్టీగా విజరు పార్టీకి మద్దతి ఇచ్చి, 107 సీట్లను గెలిపిస్తే అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించకుండా గవర్నర్ బీజేపీి కనుసన్నల్లో మెలుగుతూ మెలికలు పెడుతున్నారని విమర్శించారు. బలనిరూపణ అనేది శాసనసభలో జరగాల్సిన విషయం తప్ప గవర్నర్ రాజ్భవన్లో జరిగేది కాదని చెప్పారు. గతంలో కేరళ వామపక్ష ప్రభుత్వం ఉన్నప్పుడు, తమిళనాడు, బెంగాల్లో, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్లు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికి ఆటంకంగా మారిందన్నారు. దీని వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు కాబట్టి గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్ మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలో గవర్నర్ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరును పజలు గమనించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారిన గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, నాయకులు సిర్పంగి స్వామి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, మద్దెల రాజయ్య, గడ్డం వెంకటేష్, గణపతి రెడ్డి, సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సంగు రవీందర్, మేక అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The post గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలి appeared first on Navatelangana.